రమణ దీక్షితులు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి: టీటీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య
- తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా మాట్లాడారు
- రమణ దీక్షితుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
- భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదు
ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు మరోసారి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన తెలంగాణ టీడీపీ నేత, టీటీడీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య... తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా రమణ దీక్షితులు మాట్లాడారని విమర్శించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం మంచిది కాదని అన్నారు. రమణ దీక్షితులు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.